'గాయ్-గౌరీ' జబువా గిరిజనోత్సవం

సోమవారం, 19 నవంబరు 2007 (20:44 IST)
WD PhotoWD
భారతదేశం రహస్యాలకు, అభూతకల్పనలకు నిలయం...అనేక సంప్రదాయాలకు, విశ్వాసాలకు పట్టుగొమ్మ ఈ భూమి. కానీ నమ్మకం, గుడ్డి నమ్మకంగా పరిణామం చెందిన క్రమంలో సంప్రదాయాలు మూఢనమ్మకాలుగా రూపాంతరం చెందుతాయి. 'ఏది నిజం' శ్రేణిలో భాగంగా 'గాయ్ గౌరీ'గా పిలవబడుతూ గోవులను పూజించే విన్నూత్నమైన సంప్రదాయాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. మధ్యప్రదేశ్‌లోని జబువా ప్రాంతంలో ఈ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు.

భారతదేశంలో ఆవుకు గోమాతగా ప్రత్యేక గౌరవం ఉన్నది. ప్రస్తుత కాలంలో గిరిజన ప్రాంతాలలోని అనేక కుటుంబాలు గోవులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయి. గోమాత పట్ల తమకు భక్తిప్రపత్తులను, గౌరవాన్ని చాటుకునేందుకు గిరిజనులు గాయ్ గౌరీ ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు. దీపావళి పండుగ మరుసటి రోజు 'గాయ్ గౌరీ' ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణులు తమ ఆవులకు శుభ్రంగా అభ్యంగనస్నానం చేయించి, అలంకరిస్తారు. అలంకరించబడిన ఆవుల మందతో సహా పూజలు జరిపేందుకు 'గోవర్ధన్' దేవాలయానికి చేరుకుంటారు.
WD PhotoWD


ప్రార్థన అయిన తర్వాత పశువుల మందతో ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ పద్ధతిని 'పరిక్రమ' అని పిలుస్తారు. భీతి గొలిపే రీతిలో ఆవుల మంద ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు ఆవులమందకి ఎదురుగా నేలపై సాష్టాంగపడతారు. 'గోమాత' దీవెనలకోసమంటూ... ఆ సమయంలో ఆవుల మంద వారిపై నడుచుకుంటూ వెళ్లిపోతాయి. తమ కుటుంబం సుఖసంతోషాల కోసం ఈ ప్రాంతంలోని గిరిజనులు ఇలా చేస్తుంటారు... ఎటువంటి జంకు గొంకూ లేకుండా ఈ భయంకరమైన సంప్రదాయాన్ని గ్రామీణులు ప్రతి ఏటా ఆచరిస్తుంటారు. అంతే కాక సంప్రదాయాన్ని ఆచరించే రోజున పూర్తిగా ఉపవాసముంటారు.

WD
ఈ ప్రక్రియలో అనేక మంది భక్తులు గాయపడినప్పటికీ వారిలోని ఉత్సాహం ఇసుమంతైనా తగ్గకపోవటాన్ని మేము గమనించాము. ఆవుల మంద వస్తున్నదారిలో అదేవిధమైన భక్తి ప్రపత్తులతో వారు సాష్టాంగపడతుంటారు. ఈ సంప్రదాయాన్ని పాటించే భక్తులు, తమ జీవితంలో ఎటువంటి కష్టాలను చవిచూడరని 'గోవర్ధన్ దేవాలయం' పూజారి మాతో అన్నారు.

ఈ సంప్రదాయం పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగిన గ్రామీణులు, ఆవు పాదాలను తాకడమంటే తమ మాతృమూర్తి పాదాలను తాకిన భావనను పొందుతుంటారు. గోమాత దీవెనలను అందుకునే క్రమంలో ఎటువంటి బాధలను భరించడానికైనా వారు సిద్దపడుతుంటారు. కానీ కొంత మంది తుంటరులు తమ వినోదానికై గోవుల మందలో ఎద్దులను కూడా జత చేస్తుండటంతో ఈ సంప్రదాయం భయానకమైన రూపాన్ని సంతరించుకుంటున్నది. మరికొంత మంది అత్యుత్సాహానికి పోయి గోవుల తోకలకు బాణసంచాను తగిలిస్తుంటారు.
WD PhotoWD


అంతేకాక గోమాత దీవెనలకై ఎదురు చూస్తుండే గిరిజనులు మద్యం మత్తులో జోగుతుంటారు. ఈ సంప్రదాయ ఉత్సవంలో ఎటువంటి గొడవలు తలెత్తకూడదని ప్రతి సంవత్సరం పోలీసు బలగాలు ఇక్కడ నియమించబడతాయి. కానీ ఈ అంధ విశ్వాసానికి అడ్డు చెప్పడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. ఈ విధమైసంప్రదాయాలను గురించి మీరేమనుకుంటున్నారు............ప్రజలు నిజంగా గోమాత దీవెనలను పొందుతుంటారా లేక ఇది ఒక గుడ్డి విశ్వాసమేనా... మీ అభిప్రాయాలను మాకు రాయండి...