బెంగుళూరు, అహ్మదాబాద్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ అనంతరం కూడా శ్రీవారి పుణ్యస్థలం భద్రతలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక భక్తుడు ఆనందనిలయం వరకు సెల్ఫోన్తో వెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది. దేశంలోని ప్రధాన నగరాలపైనే కాకుండా ప్రముఖ పుణ్యస్థలాల్లో బాంబు పేలుళ్లు నిర్వహిస్తామని తీవ్రవాదులు ఒక వైపు హెచ్చరించారు.
ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పేల్చి వేస్తామని తీవ్రవాదులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల అనంతరం కూడా తిరుమల తిరుపతి దేవస్థాన (తితిదే) భద్రతా అధికారులు మేల్కొనలేదు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను నిశితంగా పరిశీలించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో కొందరు భక్తులు యధేచ్ఛగా సెల్ఫోన్లతో లోనికి వెళుతున్నారు.
తాజాగా ఒక భక్తుడు సెల్ఫోన్తో శ్రీవారి గర్భగుడి వరకు వెళ్లాడు. ఆ తర్వాత ఆనందనిలయం పరిసర ప్రాంతాల్లో శ్రీవారి ఫోటోలను చిత్రీకరించడమే కాకుండా.. వాటిని తన మిత్రులకు ఎంఎంఎస్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఖంగుతిన్న అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గతంలో విదేశీ భక్తుడు ఒకరు ల్యాప్ టాప్తో మహద్వారం వరకు వెళ్లి, భద్రతా అధికారికి పట్టుబడిన విషయం తెల్సిందే.