వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు...

ఆదివారం, 14 ఆగస్టు 2022 (08:55 IST)
శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో అన్ని వైకుంఠ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో కూడా చోటు లేకపోవడంతో ఫుట్‌పాత్‌లపైనే భక్తులను వరుస క్రమంలో కూర్చొన్నారు. 
 
ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాల కారణంగా రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తితిదే అధికారులు ముందుగానే తెలిపారు. స్వామి వారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు వేచి ఉన్నారు. దాదాపు ఆరు కిలోమీటర్లకుపైగా క్యూలైన్లు, రింగ్‌రోడ్డులో రద్దీ నెలకొంది. వీరి దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.
 
శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరిగిన రద్దీతో తితిదే సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్‌, వృద్ధులు, వికలాంగుల దర్శనాలను ఈ నెల 21 వరకు రద్దు చేస్తున్నామని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ తగ్గే వరకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు