తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు వీఐపీలు దర్శనం చేసుకున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో చిరంజీవి తన కుటుంబ సమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు.
ఇటీవల వివాహమైన తన చిన్న కుమార్తె శ్రీజ వివాహం తర్వాత మొదటిసారి స్వామి వారిని చిరంజీవి దర్శించుకున్నారు. అలాగే పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత, ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, చిరంజీవిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉన్నారు. సర్వదర్శనంతోపాటు కాలినడక భక్తులకు గంటలోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఆదివారం శ్రీవారిని 79,646 మంది భక్తులు దర్శించుకోగా, ఆలయ హుండీ ఆదాయం రూ.2.48 కోట్లుగా వసూలైంది.