తిరుమలకు పెను ముప్పు... ఎందుకు?

సోమవారం, 1 జులై 2019 (12:59 IST)
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైవున్న ప్రాంతం తిరుమల గిరులు. ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రానికి పెను ముప్పు పొంచివుందట. పచ్చని కొండలపై కాలుష్య మహమ్మారి పంజా విసురుతోందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. సప్తగిరుల్లో నిత్యం వినిపించే హరినామ ఘోష కంటే రణగొణ ధ్వనులే అధికమైనట్టు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీంతో తితిదే అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
తిరుమల ఘాట్లలో సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ టాక్సిక్‌ మెటల్స్‌ (సీఏటీఎం) మానిటర్స్‌ను కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని ఇది నమోదు చేస్తుంది. అలా నమోదైన డేటాను కాలుష్య నియంత్రణ మండలికి చేర్చుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తిరుమలలో ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం పెరిగిపోతోందని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. కాలుష్య నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని టీటీడీకి నోటీసు ద్వారా సూచించింది. 
 
తిరుపతి - తిరుమల మార్గంలో అంటే తిరుమల ఘాట్ రోడ్లపై  ఆర్టీసీ రోజుకు దాదాపు 1500 ట్రిప్పులతో బస్సులు నడుపుతోంది. అంతేగాక ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికులు, ప్రజలు వాహనాలు వినియోగించడంతో కాలుష్యం పెరిగి, పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. వాహనాల నుంచి వచ్చే విషపూరిత నైట్రోజన్‌ ఆక్సైడ్‌ (ఎన్‌వో) వాతావరణంలో ఓజోన్‌తో కలిసి ఫోటోకెమికల్‌ స్మాగ్‌ (పొగ)గా ఏర్పడుతుంది. ఇది మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఒక విధంగా చెప్పాలంటే మెట్రో నగరం హైదరాబాద్ కంటే తిరుమలలో వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు