రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

సోమవారం, 30 మే 2016 (11:14 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్‌ నెలలో సెలవులు ముగియనుండటంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. గత 15 రోజులుగా ఇదేపరిస్థితి తిరుమలలో నెలకొంది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా వారికి దర్శన సమయం 12 గంటలకుపైగా పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు కంపార్టుమెంట్లు మాత్రం కాస్త తక్కువగానే ఉంది. నాలుగు కంపార్టుమెంట్లలో మాత్రమే కాలినడక భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 4 గంటలు పడుతోంది. గదులు భక్తులకు సులువుగానే లభిస్తున్నాయి. తలనీలాలను కూడా సులువుగానే భక్తులు సమర్పిస్తున్నారు. 
 
ఆదివారం శ్రీవారిని 1,03,384 మంది భక్తులు దర్శించుకున్నారు. తితిదే చరిత్రలోనే ఇంత మంది భక్తులు దర్శించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, హుండీ ఆదాయం ఆదాయం 2 కోట్ల 98లక్షల రూపాయలు వసూలైంది.
 
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనా సమయంలో మంత్రులు గంటా శ్రీనివాస్‌, మృణాళిని, కొల్లురవీంద్ర, పార్లమెంటు సభ్యులు తోట నరసింహం, రవీంద్రబాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌లు దర్సించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి