తిరుపతిలో లడ్డూల కొరత.. 25 వేల కోటా నుంచి 15 వేలకు తగ్గింపు

ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (12:13 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తేరుకోలేని షాకిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా లడ్డూల్లో కోత విధించింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు లడ్డూల కొరత ఏర్పడింది. దీనిపై వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 
 
భక్తులకు అందించే లడ్డూల సంఖ్యను కుదించింది. దీనిపై సమాచారం లేని వెంకన్న భక్తులు తక్కువ సంఖ్యలో ఇస్తున్న లడ్డూలపై అక్కడి సిబ్బందిని నిలదీశారు. లడ్డూల కోటా తగ్గిందని చెప్పిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా లడ్డూల కోటాను ఎలా తగ్గిస్తారని భక్తులు మండిపడ్డారు. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. 
 
ఈ కోటాను 25 వేల నుంచి 15 వేలకు తగ్గించారు. ఈనెల 17వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం లడ్డూలను నిల్వ చేసే ప్రక్రియలో భాగంగా లడ్డూల కోటాను తగ్గించినట్టు ఆలయ అధికారులు చెపుతున్నారు. అయితే, అధికారుల వివరణతో భక్తులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. 

వెబ్దునియా పై చదవండి