శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో జలపాతాలు.. స్వామివారి మహిమేనని..!

శుక్రవారం, 20 నవంబరు 2015 (17:32 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునామం రూపంలో జ్యోతి గరుడ వాహనంపై ప్రజ్వలించడం అందరికీ తెలిసిందే. తాజాగా భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ.. భక్తులను అలరిస్తున్నాయి. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయంలో ఈ దృశ్యం పర్యాటకులను, భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. అది స్వామివారి మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. 
 
తిరుమల గిరులంటే.. ఏవైపు చూసిన శ్రీహరి రూపమే కనిపిస్తుంది. ఓ వైపు నుంచి చూస్తే తిరుమల గిరులు శ్రీహరిని పోలి పడుకున్నట్లు కనిపిస్తాయి. ఇక కిందకు దిగి వచ్చే రహదారిలో ఒక చోట గరుత్మంతుడి ఆకృతి కనిపిస్తుంది. 
 
శ్రీవారి విగ్రహం ఎంత ఎత్తుంటుందో.. సరిగ్గా అంతే ఎత్తులో సహజసిద్ధ శిలాతోరణం గుడికి వెనుక భాగంలో కనిపిస్తుంది. ఇక నిన్నమొన్నటి భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీవెంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ భక్తులను అలరిస్తుండటం విశేషం.

వెబ్దునియా పై చదవండి