చంద్రుడు నిర్మించిన బంగారు ఆలయం

బుధవారం, 9 ఏప్రియల్ 2008 (12:51 IST)
పరమశివుని మరో రూపమైన లింగాలు ఈ భూమిపైన 12 ప్రదేశాలలో జ్యోతిర్లింగాలుగా వెలిశాయి. అలాగే జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథేశ్వరుడు గుజరాత్‌లోని సౌరాష్ట్రలో వెలిశాడు. ఈ ఆలయం గుజరాత్‌లో ఉన్న ప్రభాస్ పఠాన్‌‌ వద్ద ఉంది. జునాగడ్ జిల్లాకు 79 కి.మీలు, ఛోర్‌వాడ్‌కు 25 కి.మీల దూరంలో ఇది ఉంది.

శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయినీ మహాకాళేశ్వరుడు, ఓంకార్ మామలేశ్వరుడు, హిమాలయ కేదారేశ్వరుడు, ఢాకినీ భీమశంకరుడు, కాశీ విశ్వేశ్వరుడు, త్రయంబకం గౌతమీతటే, పరల్యాంలోని వైద్యనాధుడు, నాగేశం డారుకావనే, సేతు బంధే రామలింగేశ్వరుడు, గృష్నేషులు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మన దేశంలో పేరు గాంచాయి.

ఈ ఆలయాన్ని పూర్వం చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రాక్షస రాజు రావణుడు వెండితో నిర్మించాడని, కృష్ణుడు చందనంతో నిర్మించాడని, రాజు భీమ్‌దేవ్ రాతితో నిర్మించారని పురాణ కథలు చెబుతున్నాయి. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం చల్లని గాలులతో వెచ్చని సముద్రపు మన్నుతో మనసును ఉత్తేజపరుస్తుంది. దీనికి సమీపంలోనే ప్రభాస్ పఠాన్ మ్యూజియం ఉంది. ఇందులో ఆలయానికి సంబంధించిన 11వ శతాబ్దాపు వైభవాన్ని చూడవచ్చు.

ఆలయం సుమారు 155 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పైభాగంలో పది టన్నుల బరువుతో కూడిన పెద్ద పాత్ర వంటిది ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలాసార్లు కూల్చి కట్టడం జరిగిందని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న నిధుల గురించి తెలుసుకున్న మొహమ్మద్ గజిని రాజు అనేకసార్లు దండయాత్ర జరిపి తన సైన్యంతో వచ్చి సంపదనంతా కొల్లగొట్టుకు పోయాడని చరిత్ర చెబుతోంది. వేసవి శెలవులలో ఎండ వేడి ఉన్నప్పటికీ, ఇక్కడి పిల్లగాలులు మనసును మైమరిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి