ప్రపంచంలోని వింతల్లో అత్యద్భుత కళా ఖండం తాజ్మహల్ ఒకటి. ప్రేమకు ప్రతిరూపంగా విశ్వసించే ఈ తాజ్మహల్.. ఫిబ్రవరి 18 నుంచి ఉత్సవాలను జరుపుకోనుంది. తాజ్కు సమీపంలోని శిల్పగ్రామ్ వద్ద ఈ ఉత్సవాలను పదిరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కళాకారులను తాజ్ రత్నా అవార్డుతో సత్కరించాలని ఉత్సవ నిర్వహణ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. బాలీవుడ్ సినీనటులు కూడా తాజ్ ఉత్సవాల్లో పాల్గొంటుండంతో ఈ కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి.
అంతేకాక బ్రిటిష్ బ్రాండ్, రష్యాకు చెందిన బాలెట్ ట్రూప్లను కూడా ఆహ్వానించారని.. బాలీవుడ్ తారల ఆటపాటలకు ఈ ట్రూప్ల సైయ్యాటల సంగీతాన్ని జోడించి తాజ్మహల్ అందాన్ని అంతా కార్యక్రమాల్లో ప్రస్ఫుటం చేయాలని నిర్వహణ కమిటీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా, తాజ్ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను www.tajmahotsava.in వెబ్సైట్లో ఇప్పటికే పొందుపరిచారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని నిర్వహణ కమిటీ తెలిపింది.
ఆగ్రాలో జిల్లా మెజిస్ట్రేట్ అధికారి ముకేష్ మేష్రమ్ మాట్లాడుతూ జిల్లాలోని స్కూల్ ఆటోడ్రైవర్లు... పర్యాటకులతో వినయంగా మెలిగి, ఉత్తమ సేవలను అందించి తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును పురస్కరించుకుని అనేక జంటలు ఇప్పటకే తాజ్ను సందర్శిస్తుండటంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.