శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్యా దేవాలయం

Pavan Kumar

బుధవారం, 28 మే 2008 (17:45 IST)
పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి ప్రాగ్జోతిషపురం కామాఖ్యా దేవాలయం. ప్రాగ్జోతిషపురమునే ప్రస్తుతం గౌహతిగా పిలుస్తున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున కామాఖ్యా దేవాలయం ఉంది. గౌహతి నగరానికి పశ్చిమ ప్రాంతంలోని నీలాచల పర్వతాలపై కామాఖ్యా అమ్మవారు స్వయంభువుగా వెలిసింది.

కామాఖ్యా అమ్మవారి దేవాలయంలో భువనేశ్వరి, బాగలముఖి, చిన్నమస్త, తార పేరుతో అమ్మవారి ప్రతిరూపాలు ఉన్నాయి. అసోంను పరిపాలించిన కొచ్ వంశ రాజులు 1565వ సంవత్సరంలో కామాఖ్యా దేవాలయాన్ని నిర్మించారని అంటారు.

కామాఖ్యా అమ్మవారిని ఎక్కువగా శక్తి పూజలు చేసే తాంత్రికులు పూజిస్తారు. రోజూ అమ్మవారికి బలివ్వటానికి అనేక జంతువులను భక్తులు తీసుకువస్తారు. అసోంను పరిపాలించిన రాజులు ఎక్కువగా కామాఖ్యా అమ్మవారిని పూజించేవారు.

దసరా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి గౌహతికి వస్తారు. ఈ సందర్భంగా వారి రాక కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

వసతి

గౌహతిలో అన్నిరకాల వారికి అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయి.

విమాన మార్గం : గౌహతిలో విమానాశ్రయం ఉంది. స్థానిక లోకప్రియ బర్డోలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయి, కోల్‌కతా, న్యూఢిల్లీలతో పాటుగా బ్యాంకాంక్‌కు విమాన సేవలు నడుస్తున్నాయి.

రైలు మార్గం : గౌహతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యాలు ఉన్నాయి.

రహదారి మార్గం : ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లటానికి గౌహతి ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు బస్సు సేవలను అసోం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏఎస్‌టీసీ) నడుపుతుంది.

వెబ్దునియా పై చదవండి