ప్రకృతి రమణీయతకు నెలవు "పేరుపాలెం బీచ్"

శుక్రవారం, 20 మార్చి 2009 (14:02 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెందిన గ్రామము పేరుపాలెం. పేరుపాలెం ఒక సుందరమైన పర్యాటక ప్రదేశమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇక్కడ మనోహరమైన, సువిశాలమైన సాగరతీరం కలదు. ఈ పేరుపాలెం బీచ్ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

పేరుపాలెం సాగర తీరంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రం మరియు వేళాంగణి మాత ఆలయాలు ప్రసిద్ధమైనవి. ప్రతి కార్తీక మాసంలోనూ ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాదిమంది యాత్రికులు అనేక ప్రదేశాల నుంచి ఇక్కడకు విహారానికి వస్తుంటారు.

ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం పేరే నరసాపురం. నరసాపురం అనే పేరుతోనే ఉన్న మండలానికి కూడా ఈ పట్టణం కేంద్రంగా ఉంటుంది. అన్నట్టు.. ఈ నర్సాపూర్‌కు దగ్గర్లోనే ఉంటుంది పేరుపాలం బీచ్. ఈ పట్టణం చుట్టుప్రక్కల పచ్చటి వరిపొలాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

నరసాపురం దగ్గర్లో గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఈ పట్టణానికి దగ్గర్లోనే అనేక సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ... పేరుపాలెం బీచ్ మాత్రం బాగా ప్రసిద్ధి చెందింది. నరసాపురం పట్టణం అయినప్పటికీ... అక్కడి వాతావరణం పల్లెటూళ్లను పోలినట్లుగా ఉంటుంది.

నరసాపురంలో దాదాపుగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో దొరికే అన్ని రకాల అల్ఫాహారాలూ దొరుకుతాయి. మసాలా బజ్జీ, అల్లం పెసరట్టు, పరాఠా ఆమ్లెట్, రకరకాల చట్నీలతో వేడి వేడి ఇడ్లీ తదితర పదార్థాలు పర్యాటకుల నోరూరిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే నరసాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల అందాలను, సముద్ర తీర ప్రాంతాల అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులు అనేక రకాల వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి