285 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

సోమవారం, 2 మార్చి 2009 (16:42 IST)
స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 285 పాయింట్లు కోల్పోయి 8,607 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 2,674 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్... 129 పాయింట్ల నష్టంతో 8,763 వద్ద ప్రారంభమైంది.

ఈ రోజు ప్రారంభానికి ముందు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావం, గత వారం వడ్డీరేటు తగ్గింపుపై ఆర్‌బీఐ ప్రకటన లేకపోవడం వెరసి స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయిందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ఆ తర్వాత రిల్, ఆర్‌పీఎల్‌ల విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం వెలువడిన అనంతరం సెన్సెక్స్ 2.78 శాతం క్షీణించింది.

దీనికి తోడు బ్యాంకింగ్, మెటల్ (లోహం) స్టాకుల రంగాల్లో విక్రయాల ఒత్తిడి.. సెన్సెక్స్‌ను మరింత బలహీనపరిచింది. ఆ తర్వాత సెన్సెక్స్ ఏ దశలోను కోలుకోలేదు. దీంతో ఇండెక్స్ కనిష్ఠంగా 8,564 వద్దకు పడిపోయింది. సాయంత్రం సమయానికి 285 పాయింట్ల నష్టంతో ముగిసింది.

బీఎస్ఈ బ్యాంకెక్స్ 5 శాతం, మెటల్ ఇండెక్స్ 4.3 శాతం చొప్పున క్షీణించాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,455 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,638 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 731 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన 86 కంపెనీల వాటాలు స్థిరంగా ముగిశాయి.

నష్టాలను చవిచూసిన కంపెనీలు
రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, జైప్రకాశ్ అసోసియేట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ యునిలివర్, గ్రాసిం, రిలయన్స్, ఎస్‌బీఐ, ఏసీసీ, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.

లాభపడ్డ కంపెనీలు
మహీంద్రా అండ్ మహీంద్రా మినహాయిస్తే మరే ఇతర కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభపడలేదు.

వెబ్దునియా పై చదవండి