దేశంలో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపడుతుందన్న క్రమంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఏర్పడం, భారత రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల కోతపై పెరిగిన అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం పలు అనుకూలతలు ట్రేడింగ్ పై ప్రభావం చూపాయి. ప్రధానంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో దూకుడు ప్రదర్శించింది.
దీంతో బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ గురువారం నాటి ట్రేడింగ్లో భారీ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ ఏకంగా 248 పాయింట్ల లాభంతో 27,346 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 8,169 వద్ద స్థిరపడింది.
ఈ ట్రేడింగ్లో డిఎల్ఎఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండియా బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, కైర్న్ ఇండియా, అంబుజా సిమెంట్, సిప్లా, సెసా గోవా, లుపిన్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.