జూలైలో హాకీ ఇండియా కార్యవర్గం ఎన్నికలు: బత్రా

FILE
హాకీ ఇండియా నూతన కార్యవర్గం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నోసార్లు వాయిదా పడిన హాకీ ఇండియా ఎన్నికలు జూలైలో జరుగుతాయని హెచ్‌ఐ కార్యదర్శి నరీందర్ బత్రా తెలియజేశారు. విద్యా స్టోక్స్ అధ్యక్షతన సమావేశమైన హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రత్యేక కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని బత్రా స్పష్టం చేశారు.

జూలైలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని బత్రా చెప్పారు. అయితే, తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని ఆయన వెల్లడించాడు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో జాతీయ పురుషులు, మహిళల హాకీ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఇంకా హెచ్ఐ ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో పంజాబ్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవాలతో సహా 25 రాష్ట్రాల హాకీ సంఘాలకు గుర్తింపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి