మానసిక ఒత్తిడితోనే పరాజయం: సైనా నెహ్వాల్

మానసికపరమైన ఒత్తిడి వల్లే తాను మలేషియా బ్యాడ్మింటన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీలో ఓటమి చవిచూడటానికి కారణమని భారత షట్లర్ స్టార్ సైనా నెహ్వాల్ వెల్లడించింది. ఇండోనిషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తర్వాత అదే ఊపును మలేషియాలో కొనసాగించినప్పటికీ.. త్వరగా అలసిపోయానని పేర్కొంది.

మలేషియా ఓపెన్ క్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన క్వాలిఫైయర్ క్సిన్ వాంగ్ చేతిలో సైనా కంగుతింది. దీంతో మలేషియా ఓపెన్ టైటిల్‌ను కూడా గెలవాలన్న సైనా ఆశలకు గండి పడింది. మలేషియా నుండి తిరిగి భారత్ చేరిన ఒక రోజు తర్వాత సైనా విలేకరులతో మాట్లాడింది.

తాను పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నప్పటికీ.. మానసికంగా బాగా అలసిపోయానని తెలిపింది. మలేషియా ఓపెన్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో కొన్ని పాయింట్లు తేలికగా వచ్చినప్పటికీ.. వాటితో విజయం అందుకోలేకపోయానని వివరించింది.

ఏదేమయినప్పటికీ.. ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారించానని సైనా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి