ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) వేలం పాటలు సోమవారం జరుగనున్నాయి. ఈ వేలం పాటల్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, గుత్తా జ్వాలా డిమాండ్ ఏ మేరకు పలుకుతుందోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. అలాగే, పి.వి.సింధుకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ లభిస్తుందో, అశ్వినీ పొన్నప్ప, పారుపల్లి కశ్యప్లు ఏ ఫ్రాంచైజీలకు ఆడతారో అనే అంశం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఆరు నగరాల్లో ఆరు ఫ్రాంచైజీలతో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐబీఎల్లో పాల్గొనే షట్లర్ల వేలం సోమవారం జరుగనుంది. రెండుసార్లు వాయిదా తర్వాత నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐకాన్లుగా నిర్ణయించిన భారత స్టార్లు ఐదుగురితోపాటు మలేసియా ఆటగాడు లీ చాంగ్ వీ కనీస ధరను కూడా రూ.30 లక్షలుగా నిర్ణయించారు.