ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో ఆడే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఔదార్యం ప్రదర్శించాడు. కువైట్లో ఈ నెలాఖరులో జరగనున్న ఐస్ హాకీ ఆసియా ఛాలెంజ్ కప్కు వెళ్లేందుకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న భారత ఐస్ హాకీ జట్టుకు అతడు బాసటగా నిలిచాడు. కువైట్ పర్యటనకు సంబంధించి ఐస్ హాకీ జట్టుకు నాలుగు లక్షల రూపాయలను అందజేశాడు.
కువైట్ ఛాలెంజ్ కప్కు వెళ్లేందుకు ఐస్ హాకీ జట్టు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమకు ఆర్థికంగా సాయం చేయాలని ఆటగాళ్లు వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేశారు. రేడియోలో, సోషల్ మీడియాలో వారు విజ్ఞప్తి చేశారు. గౌతమ్ గంభీర్ వారి విజ్ఞప్తిని రేడియో ద్వారా విన్నాడు. వెంటనే స్పందించాడు. వారికి గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ (జీజీఎఫ్) ద్వారా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించాడు.