విరహవేదనలో షోయబ్, సానియా జంట!: సానియా ట్వీట్

శనివారం, 20 సెప్టెంబరు 2014 (11:53 IST)
హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జాకు... పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లకు పెళ్లై నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇద్దరూ కలసి సమయం గడిపేందుకు ఇప్పటికీ తీరిక దొరకడం లేదు. భార్యభర్తలయినప్పటికీ... ఏడాదిలో వీరిద్దరూ కలిసి ఉండేది కొన్ని రోజులు మాత్రమే అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. 
 
అటు షోయబ్ ఇంటికి... ఇటు సానియా ఇంటికి... ఇద్దరూ కలసి వెళ్లడం చాలా అరుదుగా జరిగే విషయం. వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడం కోసం విదేశాల్లోనే వీరిద్దరూ ఎక్కువగా తమ సమయాన్ని గడుపుతున్నారు.
 
ఛాంపియన్స్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షోయబ్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఐతే, భర్త హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో సానియా నగరంలో లేదు. టోక్యోలో జరుగుతోన్న పాన్ ఫసిఫిక్ ఓపెన్‌లో ప్రస్తుతం ఆడుతోంది. దీంతో, బాధపడుతూ... ''షోయబ్ హైదరాబాద్‌లో ఉన్నాడు... నేనేమో టోక్యోలో ఉన్నాను...ప్చ్'' అంటూ నిర్వేదంతో ట్వీట్ చేసింది. 
 
సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో షోయబ్‌కు స్వాగతం పలికాడు. అనంతరం, అదే రోజు సాయంత్రం షోయబ్‌కు తన ఇంట్లో ఘనంగా విందును ఏర్పాటు చేశాడు.

వెబ్దునియా పై చదవండి