కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీపతి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నాలుగో రోజు ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు స్వామిని శ్రీ పార్థసారథి రూపంలో శ్రీ లక్ష్మీ సమేతంగా అన్ని కోర్కెలు తీర్చే అందాల "కల్పవృక్ష" వాహనంపై ఊరేగించారు. అలాగే.. ఈ రోజు రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు పృథ్విలోని ప్రభువులందరు తన అధీనంలోని వారే అని చాటిచెప్పే విధంగా "సర్వభూపాల" వాహనంపైన ఊరేగనున్నారు. ఈ రోజునే ప్రత్యేక సమయాలలో ఉత్సవమూర్తి శుద్ధికై చేయించే స్నానం అయిన "స్నపన తిరుమంజనం" కూడా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుకను మధ్యాహ్న వేళ రంగనాయకుల మండపంలో నిర్వహిస్తారు.

కాగా... బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు రాత్రి కాళీయ మర్దనుడైన బాలకృష్ణునిగా యోగ సాధకులకు గోచరించే దివ్యజ్ఞానమైన ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు.

ఏడుకొండలను ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే సర్వపాపాలు తొలగుతాయి. కలియుగంలో ప్రజల ఆర్తిని బాపి, వారిని తరింప చేయటానికి శ్రీ మహా విష్ణువు వైకుంఠాన్ని వీడి వేంకటాచలాన్ని చేరి, అక్కడి ఆనంద నిలయ దివ్యవిమానం కింద కొలువై ఉన్నారు. అందుకే తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠమైనది.

అధిష్ఠాన దైవం ప్రతినిధిగా వివిధ ఉత్సవ సమయాలలో విశేష పూజలను అందుకుంటూ, ఊరేగింపు సందర్భంగా అసంఖ్యాక భక్తుల వందనాలు, సమర్పణలు అందుకుంటూ వారి సాధక బాధకాలను ఓపిగ్గా వింటూ... తాను సదా అండగా ఉన్నానంటూ అభయాన్నిచ్చే స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి. గర్భగుడి వరకూ వచ్చి తన దర్శనం చేసుకొన అవకాశం లేని వృద్ధులు, అస్వస్థులు, చిన్నపిల్లల కోసమై తానే స్వయంగా బయటకు వచ్చి ఊరేగుతూ దర్శన భాగ్యం ప్రసాదించే దివ్యమూర్తి వేంకటేశ్వర స్వామి.

వెబ్దునియా పై చదవండి