గద్వాల్ పాలిటిక్స్ : కృష్ణా - తుగంభద్ర నదుల నడుమ అత్తా అల్లుళ్ళ సవాల్

శనివారం, 24 నవంబరు 2018 (11:53 IST)
గద్వాల్ కోట. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీస్తుశకం 1662లో నిర్మించాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోటలన్నింటిలోకెల్లా ప్రసిద్ధి చెందింది. ఇపుడు ఈ గద్వాల్ కోట (గద్వాల్ అసెంబ్లీ స్థానం) డీకే అరుణ ఆధీనంలో ఉంది. దశాబ్దాలుగా గద్వాలను తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయాలు సాగిస్తున్నారు డీకే ఫ్యామిలీ. 
 
ఈ కుటుంబం రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన డీకే అరుణ ఇప్పటికే ఇక్కడ నుంచి మూడుసార్లు గెలుపొందారు. నాలుగోసారి విజయబావుటా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు. గద్వాల్ సంస్థానంలో జేజెమ్మగా పేరుగాంచిన డీకే అరుణను ఇపుడు ఆమె మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్ ఢీకొట్టనున్నారు. 
 
ఈయన ఎవరోకాదు. తన భర్త డీకే భరతసింహారెడ్డి మేనల్లుడు. తన గద్వాల కోటలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. కానీ, ఇపుడు రాజకీయ ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ఇప్పటికే రెండుసార్లు అత్తతో తలపడిన అల్లుడు ఓడిపోయి ఇపుడు మూడోసారి తలపడనున్నాడు. కృష్ణా - తుంగభద్ర నదుల నడుమ ఈ అత్తా అల్లుళ్ళ పోరు రసవత్తరంగా మారింది. అలాంటి గద్వాల శాసనసభ స్థానం తీరుతెన్నులను పరిశీలిద్ధాం. 
 
ఈ స్థానంలో 2018 ఎన్నికల కోసం ప్రకటించిన ఓట్ల జాబితాలో మొత్తం ఓటర్లు 2,21,395 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,09,920 కాగా, స్త్రీలు 1,11,455 మంది, ఇతరులు 20 మంది ఓటర్లు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే, బీసీలు 1,37,514 మంది ఉండగా, ఎస్సీ ఓటర్లు 45,980, మైనారిటీలు 22,628, ఎస్టీలు 5,510, ఇతరులు 10,120 మంది ఉన్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గద్వాల, మల్దకల్, గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాలు ఉన్నాయి.
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణకు 83,355 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణమోహన్ రెడ్డికి 75,095 ఓట్లు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశవ రెడ్డికి 3,431 ఓట్లు వచ్చాయి. దీంతో డీకే అరుణ 8,260 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 
డీకే అరుణ బలాలను పరిశీలిస్తే.. డీకే ఫ్యామిలీకంటూ బలమైన ఓటు బ్యాంకు ఉండటం. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగివుండటం, కలిసిరానున్న ప్రజా కూటమి ఓట్లు. అలాగే, బలహీనతలు పరిశీలిస్తే, కుటుంబ ఆధిపత్యంపై వ్యతిరేకత, మంత్రిగా ఉన్న సమయంలో చెప్పుకోదగిన పరిశ్రమలు తీసుకుని రాలేదన్న కోపం ఓటర్లలో ఉంది.
 
అలాగే, తెరాస అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి బలాలను పరిశీలిస్తే, తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి హరీశ్ రావు ప్రచారం, పలు వర్గాలు, పార్టీల నుంచి తెరాసలోకి వచ్చిన వలసలు, రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి. అలాగే, బలహీనతలు పరిశీలిస్తే, అందరితోనూ కలిసిపోరన్న విమర్శ, అనేక వివాదాలున్నాయన్న ఆరోపణ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు