నేతల నయా ట్రెండ్ : యువతకు స్మార్ట్ ఫోన్ ఆఫర్.. 200 ఓట్లు వేయిస్తే చాలు...

సోమవారం, 3 డిశెంబరు 2018 (14:54 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకునేందుకు వివిధ రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు కూడా సరికొత్త కానుకలు ఇస్తున్నారు.
 
ఈనెల 7వ తేదీన తెలంగాణ ఓటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఒక్కో యువ ఓటరు తనకు అనుకూలంగా 200 ఓట్లు వేయించి ఓ స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లవచ్చంటూ ప్రకటించారు. దీంతో గల్లీ నాయకుల పంట పండుతోంది. గతంలో క్రికెట్ కిట్లతో యువకులను ఆకర్షించిన నేతలు ఇపుడు స్మార్ట్ ఫోన్‌ల ఆఫర్ ప్రకటించారు. 
 
హైదరాబాద్‌ నగరంలోని దాదాపు ఆరేడు నియోజకవర్గాల్లో వేలాది సెల్‌ ఫోన్ల పంపిణీ జరుగుతోంది. ఫోన్లను ఒక్కసారి కొంటే.. అధికారులు ఆరా తీసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అనుచరులకు డబ్బిచ్చి వారితోనే ఆన్‌లైన్‌లో బుక్‌ చేయిస్తున్నారు. తమ సోంత కార్యకర్తలకేకాకుండా పక్క పార్టీలో పేరున్న కార్యకర్తలకు.. సెల్‌ఫోన్‌తో పాటు 50 వేల నగదును అందజేస్తున్నారని తెలుస్తుంది. గల్లీలోని పెద్ద లీడర్లకు 5 లక్షల నుండి 15 లక్షల వరకు ఎన్నికల నిర్వహణ ఖర్చుల కింద నగదును ఇప్పటికే చేరవేసినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు