సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు

శనివారం, 12 డిశెంబరు 2020 (17:14 IST)
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద శబ్దంతో కంపెనీ మొత్తం మంటలు వ్యాపించడంతో కార్మికులంతా కకావికలమయ్యారు. కొందరు గాయాలతో కిందపడి అల్లాడిపోయారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కంపెనీలో లోపల మరో 35 మంది కార్మికులు చిక్కుకున్నారు.
 
మరోవైపు రియాక్టర్ పేలడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రియాక్టర్లో భారీ పేలుడు సంభవించడంతో భారీ ఎత్తులో మంటలు వ్యాపించాయి. మొదటి రియాక్టర్‌ పేలిన కాసేపటికే చూస్తుండగానే రెండో రియాక్టర్‎కు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలతో పాటు కిలోమీర్ మేర దట్టమయిన పొగ అలుముకోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితులు తలెత్తాయి. ఈ గందరగోళంలో పరిశ్రమ లోపల కొందరు కార్మికులు చిక్కుకున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
 
ఈ ప్రమాద సమయంలో పరిశ్రమ లోపల మొత్తం 35 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మార్నింగ్ షిఫ్ట్ ముగించుకుని కొందరు ఇళ్లకు వెళ్లిపోవడం మరికొందరు భోజనానికి వెళ్లడంతో ప్రమాద సమయంలో లోపల తక్కువ మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పనివేళల్లో ప్రమాదం జరిగి ఉంటే ఊహించని రీతితో కార్మికులు గాయాలపాలై ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు