అసదుద్దీన్ బెంగుళూరు వస్తే అరెస్టు చేస్తాం :: పోలీసులు

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:11 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ బెంగుళూరు వస్తే అరెస్టు చేస్తామని బెంగుళూరు సిటీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు అసదుద్దీన్‌కు పోలీసులు ఓ లేఖను పంపించారు. ఇది సోమవారం వచ్చి చేరింది. 
 
ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు తెర తీస్తున్న మజ్లిస్ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై నిషేధాజ్ఞలు పలు చోట్ల కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు నగరాల్లో వీరి ప్రవేశంపై నిషేధం అమలవుతుండగా, తాజాగా ఆ జాబితాలో బెంగళూరు కూడా చేరిపోయింది. 
 
ఈ నెల 24 నుంచి 28 దాకా అసదుద్దీన్ ఓవైసీ బెంగళూరులో పర్యటించాల్సి ఉంది. అయితే సోమవారం బెంగళూరు పోలీసుల నుంచి అసదుద్దీన్‌కు ఓ నోటీసు అందింది. ‘బెంగళూరులో మీరు ప్రవేశించడానికి వీలు లేదు. అంతేకాక ఆడియో, విజువల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రసంగించేందుకు కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఆ నోటీసుల్లో అసదుద్దీన్‌కు తేల్చిచెప్పారు. 

వెబ్దునియా పై చదవండి