నిజామాబాద్‌లో కవితను పీకేశారు... రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (20:05 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. కేసీఆర్ ఎన్నో మాటలు చెప్తారని  కానీ ఒక్కమాట మీద కూడా నిలబడరని విమర్శించారు. 
 
టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుకొచ్చారని కానీ చేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఒక్కరికైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. 
 
దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు రాజాసింగ్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన  కేసీఆర్ సీఎం అయిన తర్వాత కొడుకుకి ఒక జాబు, అల్లుడుకి ఒక జాబు, కూతురుకి ఒక జాబు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అయితే ఇటీవలే నిజామాబాద్ లో ఆ ఉద్యోగాన్ని ప్రజలు పీకేశారని చెప్పుకొచ్చారు.

స్టీరింగ్ పీకేసి అక్కా ఆడుకో అంటూ ఇచ్చేశారని కవిత ఓటమిపై పరోక్షంగా సెటైర్లు వేశారు రాజాసింగ్. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. రూ.2లక్షల 34వేల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని రాజాసింగ్ ఆరోపించారు. 
 
ఆ అప్పు చేసి ఎక్కడ పెట్టావని ప్రశ్నిస్తుంటే జవాబు లేదు, కితాబు లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పు ఆయన కుటుంబంపై లేదని, ఆయనపైనా లేదన్నారు. తెలంగాణ ప్రజలనెత్తిపై ఉందని చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని దేవరకొండ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను మరలా వస్తానని దేవరకొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని రాజాసింగ్ ప్రజలను కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు