తెలంగాణాలో కమల వికాసాన్ని జీర్ణించుకోలేని కేసీఆర్!

శనివారం, 1 జూన్ 2019 (12:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా, తెరాసకు పట్టుగొమ్మలుగా నిజామాద్ జిల్లాలో కమలం పాగా వేయడాన్ని ఆయన తట్టుకోలేక పోతారు. ఈ స్థానం నుంచి తన కుమార్తె కె.కవిత పోటీ చేసి ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.
 
అంతేకాకుండా, 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 శాతం ఓట్లు దక్కించుకున్న బీజేపీ... నాలుగు నెలల వ్యవధిలో అంటే 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని ఏకంగా 20 శాతానికి పెంచుకుంది. ఫలితంగా బీజేపీ అగ్రనేతలే ఊహించని విధంగా ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ పరిణామం తెరాస శ్రేణులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. 
 
పైగా, నిజామాబాద్ నియోజకవర్గంలో కేవలం పసుపు రైతులు, కొందరు తెరాస అసమ్మతినేతలు కవిత ఓటమికి కారకులవుతారని ఎవరూ ఊహించలేదు కూడా. పసుపు రైతులు ఏకంగా వారణాసికి వెళ్లి నామినేషన్లు వేయడం జాతీయ రాజకీయాలను కూడా ఆశ్చర్యపరిచింది. అంతేనా, తెలంగాణాలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను ఓడించి.. ఈ రాష్ట్రంలోనూ పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. ఆ దిశగా కమలనాథులు తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించారు. మొత్తంమీద బీజేపీ నేతల వ్యవహారశైలితో కేసీఆర్‌లో గుబులుపుడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు