కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ : తెరాస టిక్కెట్ తనకేనంటూ సంభాషణ

సోమవారం, 12 జులై 2021 (11:51 IST)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సివుంది. ఈ స్థానంలో తెరాస తరపున పోటీ చేసేది తానేంటూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. 
 
హుజూరాబాద్‌ టికెట్‌కు సంబంధించి మాదన్నపేటకు చెందిన యువకునితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  'టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫామ్ అయ్యింది. యూత్‌ అందరినీ తమ పార్టీలోకి గుంజాలి. యూత్‌కు ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటాను. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దాం' అంటూ కౌశిక్‌రెడ్డి ఫోన్‌‌లో సంభాషించారు. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
మరోవైపు, టీపీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సమీప బంధువు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండటంతో హుజూరాబాద్‌లో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఈటల రాజేందర్‌ను అన్ని విధాలా టార్గెట్ చేశారని జనం చర్చించుకుంటున్నారు. కాగా ఈ మధ్యనే మంత్రి కేటీఆర్‌ను కౌశిక్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి కౌశిక్ వ్యవహారం అటు కాంగ్రెస్‌లో.. ఇటు టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గానే ఉంటూ వస్తోంది.
 
ఇదిలావుంటే, కౌశిక్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి ఈ షోకాజ్ నోటీస్‌ను జారీ చేశారు. కౌశిక్ కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. టీఆర్ఎస్‌ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
గతంలోనే కౌశిక్‌రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. 24 గంటల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్‌లో క్రమశిక్షణ సంఘం పేర్కొంది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, బీజేపీ కూడా ఈ స్థానంలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు