తెలంగాణాలో కరోనా సమూహ సంక్రమణ ప్రారంభం : ఆరోగ్య శాఖ

గురువారం, 23 జులై 2020 (16:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి ప్రారంభమైందని, అందువల్ల మరో నాలుగైదు వారాలు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరంలో కొత్త కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో వైరస్ విస్తరిస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిస్థితి ఉందని చెప్పారు. 
 
వైద్య సిబ్బంది కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. రానున్న నాలుగైదు వారాలు చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా పేషెంట్లకు వెంటనే చికిత్స చేస్తే మంచిదని తెలిపారు.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు 50 వేలకు చేరువయ్యాయి. బుధవారం రాత్రి నాటికి గడిచిన 24 గంటల్లో మొత్తం 30 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,554 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కు చేరింది. 
 
కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 842, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 96, కరీంనగర్‌లో 73, నల్లగొండలో 51, వరంగల్‌ అర్బన్‌లో 38, వరంగల్‌ రూరల్‌లో 36, ఖమ్మంలో 22 కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది మృతితో మొత్తం మరణాలు 438కు చేరాయి. 
 
రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.88గా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 1,281 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 37,666 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 11,155 యాక్టివ్‌ కేసులున్నాయి. బుధవారం 15,882 టెస్టులు నిర్వహించినట్లు బులెటిన్‌లో వివరించారు. వీటితో రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 3,08959కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు