ఓటుకు నోటు కేసు : రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీట్

గురువారం, 27 మే 2021 (16:20 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. కొన్నేళ్ళ తర్వాత ఈ కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. 
 
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ అభియోగాలు మోపింది.
 
అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.
 
ఈ క్రమంలో ఈ కేసులో గురువారం ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ... చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 
 
అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు