తెలంగాణలో ప్రజలు ఇక తెలుగుదేశం పార్టీ బతికే పరిస్థితి లేదనీ, అందువల్ల తను నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెరాసలో చేరినట్లు తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకత ఏమీ లేదని, ఆయనంటే తనకు చాలా ఇష్టమన్నారు.
ఐతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితి వచ్చిందనీ, ఇక్కడ ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం లేదు కనుక ప్రజల మనోభావాలను అనుసరించి పార్టీ మారక తప్పలేదన్నారు. తనొక్కడినే కాదు మిగిలినవారు కూడా తెరాసలో చేరిపోయి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇక తెలుగుదేశం కనుమరుగవుతుందనీ, ఆ పార్టీ మనుగడ సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.