గులాబీ కండువా కార్యకర్తలకే సబ్సీడీ ట్రాక్టర్లు : గుత్తా

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:10 IST)
సబ్సీడీ ట్రాక్టర్ల పంపిణీలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీగుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తలు, నేతలకు మాత్రమే వీటిని పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయం అంటే తెలియని వాళ్లకు ట్రాక్టర్లు ఇచ్చారని మండిపడ్డారు. 
 
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అవకతవకలపై ముఖ్యమంత్రికి విజిలెన్స్‌ కమిషన్‌కు లేఖ రాశానని గుత్తా అన్నారు. దీనిపై సీఎం విచారణ జరిపించాలని పథకం పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని ఎంపీ గుత్తా డిమాండ్‌ చేశారు. అలాగే, అంతగా ఆదరణలేని ట్రాక్టర్ల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక మతలబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు కాకుండా టీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారని గుత్తా విమర్శించారు. లబ్దిదారుల ఎంపిక అధికారం మంత్రులకు ఇవ్వడం వల్ల వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ రైతులకు అన్యాయం జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయకుండా మంత్రులు తమకు నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి