తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు అసైన్డ్ భూములు తీసుకుని... ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు స్థాపించలేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. పైగా దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇతర కులాల వారు కొనుగోలు చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ.. ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా పొన్నాల ఎలా కొన్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ.25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ.. విక్రయించడం కానీ చేయకూడదని హరీష్ రావు గుర్తు చేశారు.