ఓటుకు నోటు కేసు ప్రధాన నిందితుడు, టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి గురువారం హైకోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గం వీడకూడదని విధించిన బెయిల్ షరతులను సడలించాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలుగు దేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేతగా ఉన్నందున హైదరాబాదుకు తాను తరచూ వెళ్లాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కారణంగా కొడంగల్ దాటి బయటకు రాకూడదన్న షరతును తొలగించాలని రేవంత్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. అయితే దీనికి తెలంగాణ ఏసీబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి రేవంత్ రెడ్డి పిటిషన్ను కొట్టిపారేశారు.