ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్నా.. అమ్మ : ఎంటెక్ స్టూడెంట్ సూసైడ్

మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:43 IST)
హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఓ ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ గదిలోని కిటికీ చువ్వలకు ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన ఆర్.మౌనిక (27) అనే యువతి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్-నానో టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తూ వస్తోంది. మహిళల వసతి గృహం ఎల్‌హెచ్-7లోని రూము నంబరు 24లో ఉంటోంది. 
 
అయితే, ఆదివారం రాత్రి అందరితోపాటే నిద్రపోయిన మౌనిక సోమవారం ఉదయం గది నుంచి బయటకు రాలేదు. డోర్ తెరుచుకోకపోవడంతో అనుమానించిన స్నేహితులు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. 
 
దీంతో రాత్రి 8 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి హతాశులయ్యారు. వెంటిలేటర్ కిటికీ చువ్వలకు ఆమె ఉరివేసుకుని కనిపించింది. మౌనిక ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు.
 
అయితే, ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నోట్‌లో.. ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్నా.. అమ్మ’ అని రాసింది. ఈ నెల 18నే హాస్టల్‌కు వచ్చిన మౌనిక అంతలోనే ఇక లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు