కోరుట్లలో కుంభవృష్టి : దూల్ మిట్టాలో 10.7 సెంటీమీటర్ల వాన

సోమవారం, 16 ఆగస్టు 2021 (10:47 IST)
తెలంగాణా రాష్ట్రంలో తడిసి ముద్దైపోతుంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం వరకు జగిత్యాల, కరీంనగర్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. 
 
సోమవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
 
అలాగే, కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ వాన పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. 
 
పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలావుంటే, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు