కరోనా నియంత్రణకు హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక చర్యలు

గురువారం, 5 మార్చి 2020 (05:57 IST)
హైదరాబాద్‌లో కరోనా వైరస్‌పై తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో మెట్రో ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిత్యం వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండగా.. డిపోలో ప్రతి మెట్రో రైలును స్టెరిలైజ్ చేసి, అధికారి ధృవీకరించాకే ట్రాక్ పైకి పంపిస్తున్నారు.

మెట్రో స్టేషన్లు, రైళ్లు, చేతులు తగిలే ప్రాంతాలు, ఎస్కలేటర్లు, హ్యాండ్ రైల్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

షేక్ హ్యాండ్ ఆరోగ్యానికి హానికరం
ఇప్పటి వరకు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే బోర్డులు చదివి ఉంటారు. వాటి గురించి తెలుసుకొని ఉంటారు. కానీ కరోనా పుణ్యమా అని షేక్ హ్యాండ్ ఆరోగ్యానికి హానికరంగా మారింది. 

ఏ ఇద్దరు కలిసినా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే వాళ్లు కానీ ఇప్పుడు మాత్రం పద్ధతిగా నమస్కారం పెడుతున్నారు. షేక్ హ్యాండ్ వల్ల కరోనా వ్యాపిస్తుందనే ప్రచారం నడుస్తుండటంతో షేక్ హ్యాండ్ కాకుండా పాత పద్ధతిలో నమస్కారం పెడుతున్నారు.
 
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు
తెలంగాణలో కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో అనుమానితులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికే రావాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులకు అనుమతి తీసుకున్నామని.. కాబట్టి అనుమానితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టులు చేయించుకోవచ్చన్నారు. అటు కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
 
కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక ఆస్పత్రి?
తెలంగాణలో కరోనా పేషంట్లకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఆస్పత్రిలో వారికి చికిత్స అందించేందుకు వికారాబాద్ జిల్లా అనంతగిరి దగ్గర ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తుండటం తెలిసిందే.
 
వేసవి సీజన్ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
వేసవి సీజన్ వస్తున్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్-పాట్నా మధ్య రెండు రైళ్లు నడపనుండగా.. హైదరాబాద్-రామేశ్వరం-హైదరాబాద్ మధ్య 26 సర్వీసులు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్-కొచువెలి-హైదరాబాద్ మధ్య మరో 26 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు