తెలంగాణాలో సంపూర్ణ లాక్డౌన్.. దుకాణాలు మాత్రం... : కేబినెట్ నిర్ణయం

మంగళవారం, 11 మే 2021 (15:21 IST)
తెలంగాణా రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ సారథ్యంలో సమావేశమైన మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది. మరోవైపు, వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబెల్ టెండర్లను ఆహ్వానించాలని కూడా నిర్ణయించింది. 
 
ఈ లాక్డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది. కోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల కొద్దిమేర కరోనా కేసులు, మరణాలు తగ్గినా... ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని కొన్నిరోజుల పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
కాగా, రంజాన్ (మే 14) తర్వాత లాక్డౌన్ ప్రకటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. కానీ అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రేపటి నుంచే లాక్డౌన్ అమలు చేయాలని నేటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు