ఎస్.ఐ. విడదీశాడంటూ ఫ్లెక్లీసులు.. అమ్మాయి కుటుంబం మోసం చేసిందనీ యువకుడు ఆత్మహత్య

ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (11:59 IST)
పెద్దల సమక్షంలో పెళ్లి చేయించేందుకు అంగీకరించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ తర్వాత మోసం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడు తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీబీపేట ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన దండుగుల వరప్రసాద్ (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనులు చేసేవారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకొని బీబీపేట ఠాణాకు తీసుకొచ్చారు. ఈ సమయంలో అమ్మాయి కుటుంబసభ్యులు 10 రోజుల తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేయిస్తామని యువతిని ఒప్పించారు. 
 
ఈ మేరకు ఠాణాలో లేఖ రాసిచ్చి ఆమెను తీసుకెళ్లారు. 10 రోజుల తర్వాత అమ్మాయి మనసు మార్చుకొని ఎవరంతట వారు ఉందామని చెప్పి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన వరప్రసాద్‌ మార్చి 24వ తేదీన మెదక్‌ జిల్లా రామాయంపేట శివారులో పురుగుల మందు తాగాడు. 
 
వెంటనే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. యువతి, ఆమె కుటుంబ సభ్యులే తన కొడుకు చావుకు కారణమని తండ్రి దండుగుల స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
 
ప్రేమికులను ఎస్ఐ సాయికుమార్‌ విడదీశారంటూ మండల కేంద్రంలోని ఆయా చోట్ల ఆయనతోపాటు వరప్రసాద్‌ పెళ్లి చేసుకున్న చిత్రాలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. పెళ్లి చేసుకొని ఠాణాకు వెళ్తే అమ్మాయిని బెదిరించి కుటుంబసభ్యులకు అప్పగించారని ఆరోపించారు.
 
వరప్రసాద్‌ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆయన కుటుంబీకులు, బంధువులు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు