హవాల్ధార్ పరుశురాం భౌతిక కాయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు

ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:43 IST)
జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లోని లేహ్ లో  మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తాండ కు చెందిన పరుశురాం ఆర్మీ లో హవాల్ధార్ గా పనిచేస్తు ఆన్ డ్యూటీ లో ప్రమాదవశాత్తు దేశ సేవలో అకాల మరణం చెందిన పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు  మహేష్ రెడ్డితో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు. 
 
ప్రస్తుతం లడక్ లోని లేహ్ లో విధులు నిర్వహిస్తు గురువారం లేహ్ లోని ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం తో పరుశురాం మరణించారని ఆర్మీ అధికారులు సమాచారం అందించారన్నారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలను కీర్తించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
 
పరుశురాం సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, మహబూబ్ నగర్ పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందిస్తున్నట్లు గా మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
 
వీటితో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వము పరుశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి పరుశురాం కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 
 
గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్  సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా హవాల్ధార్ పరుశురాం భౌతిక కాయానికి సైనిక అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు