రైతును లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా... ఎక్కడ?

గురువారం, 30 జులై 2020 (10:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాను పాలక వర్గానికి చెందిన నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో పోలీసులు, అధికారులు కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇసుక మాఫియా ఓ రైతు ప్రాణాలు తీసింది. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకోవడమే ఆ రైతు చేసిన పాపం. అంతే.. అదే ఇసుక లారీతో రైతును తొక్కించి ఇసుకు మాఫియా చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌ జిల్లా రాజాపూర్ మండలం, తిర్మలాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తన పొలం నుంచి ఇసుకను తవ్వితీసి అక్రమంగా రవాణా చేస్తుండగా రైతు గుర్రంకాడ పోచయ్య (38) అనే రైతు అడ్డుకున్నాడు. బోర్లు ఎండిపోయి మూడేళ్లుగా బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదని, దయచేసి ఇసుకను తరలించొద్దంటూ ప్రాధేయపడుతూ లారీకి అడ్డుగా నిలిచాడు. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగడమే కాకుండా పోచయ్యను లారీతో ఢీకొట్టి హతమార్చింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు