రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాద్ నగరంలోని పాతబస్తీలో మరో ఘోరం వెలుగు చూసింది. పాతబస్తీలో పేద ముస్లిం కుటుంబాలను లక్ష్యం చేసుకున్న బ్రోకర్లు వారికి కల్లబొల్లి కబుర్లు చెబుతూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్న విషయం తెల్సిందే. దుబాయ్ షేక్లకు తాత్కాళిక పెళ్లిళ్లకు యువతులను సప్లై చేయడమే కాకుండా, మంచి వేతనంతో ఉద్యోగాలంటూ వంచిస్తున్నారు.
తాజాగా హైదరాబాదులోని పాతబస్తీ రెయిన్ బజార్కు చెందిన తమీమ్ ఫాతిమా అనే మహిళను మంచి ఉద్యోగం, మంచి వేతనం అంటూ వీలైనన్ని అబద్ధాలు చెప్పి దుబాయ్కి పంపించాడు స్థానిక బ్రోకర్ అబిద్ సయ్యద్. అతని మాటలు నిజమని నమ్మిన ఆమె దుబాయ్ వెళ్లాక నరకం చూసింది. ఇంట్లో పని అని వెళ్లిన తమీమ్ ఫాతిమాను వ్యభిచారం రొంపిలోకి దింపే ప్రయత్నం జరిగిందట.
దీనికి నిరాకరించిన ఆమెకు చిత్రహింసలు చూపుతున్నారట. ఆమె ఆరోగ్యం బాగాలేదని కుటుంబం సభ్యులకు ఫోన్ రావడంతో విషయం తెలుసుకుని పాతబస్తీ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్, మోసం, తప్పుదోవ పట్టించడం వంటి సెక్షన్లపై బ్రోకర్ అబిద్పై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఆమెను వీలైనంత త్వరగా హైదరాబాదు రప్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.