సంక్రాంతి గంగిరెద్దుల్లా కొంతమంది నేతల ప్రచారం: రేవంత్‌రెడ్డి

సోమవారం, 23 నవంబరు 2020 (07:06 IST)
హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికలకోసం కొంతమంది నేతలు సంక్రాంతి గంగిరెద్దుల్లా వచ్చి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

భాజపా నాయకత్వం లోపం వల్ల నేతలను తయారుచేసుకోలేక కాంగ్రెస్‌ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాషాయ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.

జనసేనతో పొత్తు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెబితే.. ఆయనకి సమాచారం లేకుండానే పవన్‌ కల్యాణ్‌ మద్దతును కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ కోరారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌పై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారని.. తాను ఆయనపైనే ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ జావడేకర్‌కు రేవంత్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. 
వీటిపై సమాధానం చెప్పాకే దిల్లీ వెళ్లాలి

‘‘మైహోం సిమెంట్‌ సంస్థకు పర్యావరణ, అటవీ అనుమతులు లేవని నాతోపాటు భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఫిర్యాదు చేస్తే ప్రకాశ్‌ జావడేకర్‌ ఏం చర్యలు తీసుకున్నారు?శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

మూసీ నది ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని నాతో సహా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. చర్యలు తీసుకొని ఉంటే ఈస్థాయిలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదు.

హుస్సేన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడ సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించలేదు?’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.

వీటిపై సమాధానం చెప్పాకే జావడేకర్‌ దిల్లీ వెళ్లాలని రేవంత్‌ వ్యాఖ్యానించారు. తెరాస, భాజపా వరద, బురదలా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు