పాపం ఆ ఇద్దరు నేతలు!

సోమవారం, 16 డిశెంబరు 2019 (05:47 IST)
భూపాలపల్లి నుంచి 2014లో గెలుపొందిన మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏ పదవి లేక ఇంటికే పరిమితమయ్యారు.

ఎన్నికల ముందు "ఈ దఫా బరిలోకి దిగవద్దు'' అని మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ నచ్చచెప్పారు. "పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే మీకు గౌరవప్రదమైన పదవి కట్టబెడతాం'' అని కేసీఆర్‌ హామీ ఇచ్చినా మధుసూదనాచారి ససేమిరా అన్నారు. దీంతో ఒక మెట్టు దిగిన కేసీఆర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి చారికి అవకాశం కల్పించారు.

అయితే స్థానికంగా పరిస్థితులు కలిసిరాక మధుసూదనాచారి ఓడిపోయారు. ఈ తరుణంలో ముందుకు వెళ్లలేక.. ఏ పదవి అడగలేక ఆయన మిన్నకుండిపోయారు. కొత్త సంవత్సరంలో తెలంగాణలో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో కొన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో అధినేత ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశతో ఆయన ఎదురుచూస్తున్నట్టు సమాచారం!
 
టీఎన్‌జీవోల నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు స్వామిగౌడ్. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని స్వామిగౌడ్ ఆశించినా ఆ అవకాశం దక్కలేదు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గoలో ఎమ్మెల్సీగా బరిలోకి దిగి బంపర్‌ మెజారిటీతో గెలిచారు.

కానీ ఆయన ఆశించినట్టుగా అమాత్యపదవి మాత్రం దక్కలేదు. కానీ సీఎం కేసీఆర్‌ ఆయనను మండలి ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. తన ఆరేళ్ల పదవీకాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా శాసనమండలిని నడిపించారు స్వామిగౌడ్.
 
మండలి ఛైర్మన్ పదవీకాలం ముగియడంతో స్వామిగౌడ్ మరోమారు తనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌నీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నీ కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు సానుకూల సంకేతాలు మాత్రం రాలేదు.

అయితే బీజేపీలోకి స్వామిగౌడ్ జంప్‌ చేస్తారంటూ అప్పటికే బాగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఆయన కోరుకున్న పదవులు దక్కలేదన్నది పార్టీ వర్గాల టాక్‌! బీజేపీలోకి తాను మారనని స్వామిగౌడ్‌ పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఆయనకు కేసీఆర్ దర్శనభాగ్యమే కలగలేదని చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో తనతోపాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కడంతో స్వామిగౌడ్ సైలెంట్ అయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు