ఆర్టీసీ బస్సు యువకుడి తలపై నుంచి దూసుకెళ్లింది.. అంతే...?

శనివారం, 26 మార్చి 2022 (11:01 IST)
ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్ పై నుంచి కింద పడ్డ ఆ యువకుడిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో కొత్తగూడెంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన నర్సింహా స్థానిక మున్సిపాలిటీలో జవానుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిచరణ్ లక్ష్మిదేవిపల్లిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. 
 
రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన సాయిచరణ్ శుక్రవారం మధ్యాహ్నం సమీప బంధువైన మరో విద్యార్థి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. వాహనం నడుపుతున్న సాయిచరణ్‌ ప్రధాన రహదారిపై యూ టర్న్‌ తీసుకున్నాడు. 
 
అక్కడ రోడ్డు పునర్నిర్మాణానికి తెప్పించిన ఇసుక, సిమెంటు బిళ్లలు ఉన్నాయి. యూ టర్న్ తీసుకునే క్రమంలో బైక్ సిమెంటు బిళ్లలపైకి ఎక్కింది. ఈ ఘటనతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. వెనుకాల కూర్చున్న యువకుడితో పాటు సాయిచరణ్ కింద పడిపోయాడు.
 
అదే సమయంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సాయిచరణ్ తల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
బస్సు డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే తన కుమారుడు మృతి చెందాడంటూ తండ్రి నర్సింహా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు