దళిత కులంలో పుట్టడమే నేను చేసిన నేరం : టి మంత్రి టి రాజయ్య

ఆదివారం, 25 జనవరి 2015 (10:41 IST)
దళిత కులంలో పుట్టటమే తాను చేసిన నేరమని, అంతకుమించి తాను ఏ తప్పూ చేయలేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖామంత్రి టి రాజయ్య పేర్కొన్నారు. ఈ మేరకు తెరాస పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. 
 
వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలతో పాటు.. స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై అలసత్వం ప్రదర్శించినందుకు గాను టి రాజయ్యను మంత్రివర్గం నుంచి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ముఖ్యమంత్రికి ఆదివారం సుదీర్ఘ లేఖ ఒకటి రాశారు. 
 
ఇందులో తాను తెలిసి ఏలాంటి తప్పు చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. తెలీక ఏవైనా తప్పులు చేసివుంటే మన్నించాలని ఆయన ప్రాధేయపడ్డారు. ఈ లేఖలో తనపై, తన శాఖపై వచ్చిన ఆరోపణలన్నింటికి ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, దళిత కులంలో పుట్టటమే తాను చేసిన నేరమని, ఉన్నత పదవిలో ఉండటం కొందరికి నచ్చలేదని, అందుకే తనను టార్గెట్ చేశారన్నారు. 
 
స్వైన్‌ ఫ్లూపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నామని, అనవసర ప్రచారం కారణంగా జనం మాస్కులు పెట్టుకుని తిరుగుతుండగా, డాక్టర్లు బతుకుతున్నారని ఆయన అన్నారు. వ్యాధి తీవ్రత పెరిగాక ఇప్పుడు తనను బలిపశువును చేయాలనీ చూస్తున్నారని, మీడియా కూడా సహకరించట్లేదని ఆయన వాపోయినట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి