స్నేహితుడి చెప్పు కోసం వెళ్లి విగతజీవిగా మారిన బాలుడు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:56 IST)
తెలంగాణా రాష్ట్రంలో స్నేహితుడి చెప్పును కోసం వెళ్లిన ఓ పసిబిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. చెరువులో పడి విగతజీవుడుగా మారిపోయాడు. దీంతో మృతుని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం, రాంపురంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంపురానికి చెందిన రావుల వాసుదేవ్‌రెడ్డి, సుజన దంపతులు 15 ఏళ్లుగా తట్టిఅన్నారం హనుమాన్‌ నగర్‌లో నివసిస్తున్నారు. వాసుదేవ్‌ రెడ్డి కుమారుడు ధీరజ్‌ రెడ్డి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
మూడేళ్ల క్రితమే ముంబైలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ధీరజ్‌ రెడ్డి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. కుమారుడు రిశిక్‌రామ్‌ రెడ్డి(7)ని తల్లి, తండ్రి వద్ద ఉంచిన ధీరజ్‌ అప్పుడప్పుడూ వచ్చిపోయేవాడు. బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు.
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇదే కాలనీలో ఉంటున్న మేఘనాథ్‌ అనే స్నేహితుడితో కలిసి బాలుడు ఆడుకునేందుకు వెళ్లాడు. కాలనీకి సమీపంలోనే చెరువు ఉండడంతో సైకిల్‌ తొక్కే క్రమంలో రిశిక్‌రామ్‌ రెడ్డి చెప్పు జారి అందులో పడింది. 
 
తీసేందుకు ప్రయత్నిస్తుండగా పాకురు ఉండడంతో ఇద్దరూ జారి చెరువులో పడిపోయారు. రిశిక్‌రామ్‌ రెడ్డి మునిగిపోగా.. మేఘనాథ్‌ కంప చెట్టును పట్టుకుని ఉండిపోయాడు. కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాడు సాయంతో చెరువులోకి దిగి మేఘనాథ్‌ను రక్షించారు. రిశిక్‌రామ్‌రెడ్డి తీసేలోపే మృతిచెందాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు