ఇ-పాస్ లేకుండా వచ్చారా? తిన్నగా వచ్చిన దారినే వెనక్కెళ్లండి: ఏపీ వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి

సోమవారం, 24 మే 2021 (10:43 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ -19 లాక్‌డౌన్ అమలు కావడంతో, తెలంగాణ పోలీసులు హైవేల వద్ద ఇ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించి, ఇ-పాస్‌లు లేని వాహనాలను అడ్డుకుంటున్నారు. ఆదివారం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి తెలంగాణ వైపు వస్తున్న పలు వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుని ఇ-పాస్ లేనందువల్ల వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లాలని పంపిచేశారు.
 
ఆంక్షల గురించి తెలియక, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటను దాటి విజయవాడ-హైదరాబాద్ రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. కానీ, తెలంగాణ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి ఇ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఇ-పాస్ పొందాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల ప్రకటించారు. కానీ, అది తెలియక చాలామంది సూర్యపేట ద్వారా తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
 
గుంటూరు జిల్లా ప్రయాణికుల విషయంలో కూడా ఇదే. తెలంగాణ పోలీసులు ఎపి వాహనాలను అంతరాష్ట్ర సరిహద్దు నుంచి గుంటూరు జిల్లాకు పంపించారు. తెలంగాణ పోలీసుల ఆంక్షలతో అనేక వందల మంది నిరాశ చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇ-పాస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యవసర పనులకు హాజరు కావాలనుకున్న చాలా మంది ప్రజలు టిఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నిరాశ చెందారు.
 
గుంటూరు జిల్లా నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు నల్గొండ జిల్లాలోని వడపల్లి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ సమీపంలో అడ్డుకున్నారు. ఇ-పాస్ లేనందున తెలంగాణ పోలీసులు గుంటూరు జిల్లాకు చాలా వాహనాలను తిరిగి పంపారు. మరోవైపు, కొంతమంది పోలీసు అధికారులు ప్రయాణికులతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని, వారు తిరిగి ఎపికి వెళ్లకపోతే లాఠీచార్జ్ చేస్తామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ప్రయాణీకులు వడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసుల ప్రవర్తనపై నిరసన తెలిపారు. ఈ-పాస్ విధానాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారని గురజాల డిఎస్పీ బి మెహర్ జయరామ్ ప్రసాద్ తెలిపారు.
 
ఆదివారం కర్నూలు-తెలంగాణ రహదారిపై కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇ-పాస్ లేనందున కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు, అంబులెన్స్‌లను హైదరాబాద్ వైపు తరలించడానికి అనుమతించారు. హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి వచ్చే అంబులెన్స్‌లను నిరోధించడాన్ని తెలంగాణ హైకోర్టు ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు