తెలంగాణలో ముగ్గురు రైతుల ఆత్మహత్య ... అప్పుల బాధతో...

బుధవారం, 15 అక్టోబరు 2014 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దీపకుంటలో బొబ్బిలి వెంకటరెడ్డి అనే రైతు తన 10 ఎరకాల పత్తిపంట ఎండిపోయిందన్న మనస్తాపంతో, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. 
 
అలాగే, కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో మధురయ్య విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు ఎకరాల భూమిలో వరి సాగు కోసం లక్ష రూపాయలు అప్పు చేసిన మధురయ్య ఆ అప్పును తీర్చలేనన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇకపోతే.. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లిలో మాలోతు రవి అనే రైతు తన మిరప చేనులో పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. తాను వేసిన పత్తి, మిరప పంటలు ఎండిపోయాయన్న బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి