పొద్దస్తమానం తమ జపం చేయనిదే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిద్రపట్టదని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఏపీ అసెంబ్లీ విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విసిరే సవాళ్ళకు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాటి నుంచి తప్పించుకునేందుకు తమ గురించి ప్రస్తావించడం చంద్రబాబుకు అనవాయితీగా మారిపోయిందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర మంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు అనేక ఆరోపణలు చేసిన విషయంతెల్సిందే. వీటిపై తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు స్పందించారు. ఏపీ అసెంబ్లీలో తమ నేత కేసీఆర్, తెరాస మంత్రుల పేర్లను ప్రస్తావిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆయన ముమ్మాటికీ దొంగేనన్నారు. చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలకు అసహ్యం కలుగుతోందని, జగన్ సవాళ్లకు సమాధానం చెప్పలేక ఆయన తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మాదిరిగా చంద్రబాబును కూడా కుప్పంకే పరిమితం చేయాలని కోర్టును కోరనున్నట్టు తెలిపారు.