దుబ్బాకలో ఓడినా కేసీఆర్ తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు: విజయశాంతి

మంగళవారం, 17 నవంబరు 2020 (14:30 IST)
జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమిపాలైనా కూడా కేసీఆర్ దొరగారికి గాంభీర్యం తగ్గలేదని విమర్శించారు. దుబ్బాక ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవదూరమైన ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.
 
ముఖ్యమంత్రి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఏదైనా అద్భుతం జరుగుతుందని ఊహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనేక సంవత్సరాలు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకపోవడమే ఓటమికి కారణమని తెలిపారు.
 
గత ఎన్నికల్లో కేసీఆర్ హామీలపై భ్రమలు పెంచుకున్న ఓటర్లు ఈసారి టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. ఏది ఏమైనా ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి మేసే వారికి కాకుండా పనిచేసేవారికి దక్కాలని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవమని విజయశాంతి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు